Friday, May 20, 2011

భస్మోధ్ధూళిత విగ్రహాయ నమః

భస్మోధ్ధూళిత విగ్రహం భవ నాశనం చేస్తుందని మార్కండేయుడు స్తుతించాడు.విపరీత భయాందోళనలకు,భూతాది ప్రేతాది జ్వరములకు ప్రధమ ఔషధం విభూది.మృత్యుంజయాది మహామంత్రముల తో పరమేశ్వరుని పూజించేటప్పుడు సమర్పించేది భస్మమే.కాబట్టి ఆర్బాటము అనిపించినా మనము ధరించవలసినది,పరమేశ్వరునికి దగ్గర చేసేది భస్మమే.

భస్మ దిగ్ధ కలేబరం భవ నాశనం భవ మవ్యయం
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం.

పరీక్ష్య లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణః నిర్వేదమాయాత్

అనిత్యము,అసత్యమయిన ఈ లోకము ఏ సాధకుడినీ సమాధాన పరచదు. బ్రహ్మ జ్ఞానము ను అన్వేషించు వాడు, ఏ పరమాత్మ వలన ఈ జగత్తు ప్రతిబింబించుచున్నదో వాని కోసం పరితపిస్తాడు. అనిత్యమయిన ఈ జగత్తు నందు (జాయతే గచ్చతే ఇతి జగత్) అన్నీ వచ్చి పోయేవే అని వివేకముతో  బ్రహ్మ జ్ఞానము ను పొందిన గురువు కోసం అన్వేషణ చేస్తాడు.

Tuesday, May 3, 2011

అవ్యాజకరుణామూర్తి

నా సామర్ధ్యము శూన్యము.
భగవంతుని కృపయే కీలకము.
ఇదే వినయము.

శంకరులు షట్పదీ స్తోత్రం ఆరంభంలోనే అంటారు 'అవినయ మపనయ విష్ణో' (అవినయనము లెకుండా చేయి,స్వామీ). పరమభాగవతోత్తములు ఇది భగవంతుని పొందటానికి సులభమార్గము అని పేర్కొన్నారు.

క్షమస్వ, పాహి, త్రాహి, రక్షమాం ఇత్యాది ప్రయోగములు అనేకపర్యాయములు కవివరేణ్యులు చేసింది అందుకనే గదా!

Monday, May 2, 2011

భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా

శ్రావణ బహుళాష్ఠమి నాడు భగవంతుడు చెరసాల లో దేవకీ వసుదేవులకు లీలా మాత్రంగా జన్మించాడు.కంసుడు చెరసాల వద్ద అసంఖ్యాకమయిన రాక్షస సైనికులను ఏర్పాటు చేశాడు. భగవంతుడు ఎప్పుడయితే ఆత్మనుండి సాకార రూపంలో సృజించుకున్నాడో, రాక్షసులందరూ మాయ కమ్మి నిద్రించారు.

ఎక్కడయితే శ్రీమన్నారాయణుడు సాధకునిచే మనసున భావింపబడతాడో ఆ మనసులో కామ క్రోధమనెడి రాక్షస ప్రవృత్తులు నిద్రపోవలసినదే.

Sunday, May 1, 2011

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం

 ఒక ప్రశాంతమయిన చెరువులో ఉన్నట్టుండి అలజడి మొదలయ్యింది.చేపలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. జాలరులు వస్తున్నారు, మనము తప్పించికునే మార్గం ఏమన్నా ఉన్నదా అని చర్చ జరిగింది. వయసులో పెద్దవయిన కొన్ని చేపలు అన్నాయి "వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వేడుకుందాము" అని. వయసులో చిన్నవయినవి అన్నాయి శత్రువు పాదాల దగ్గరికి పోవాలా అని.వాటి ఇష్ఠానిసారం చేశాయి, బుద్ది కర్మని అనుసరిస్తుంది గదా. జాలరులు లోతు ఉన్న చోట చేపలు బాగా దొరుకుతాయి అన్న లెక్కతో కొంత ముందుకి వెళ్ళారు.వేడుకుందాము అని చెరువు గట్టికు దగ్గరగా వచ్చిన చేపలు బతికాయి.

కాలం ప్రతి క్షణం కబళించడానికి దగ్గరకు వస్తుంది. మనం గనక కాలకాలుడిని ఆశ్రయిస్తే భక్తుడి కోసం కాలకూఠవిషమును సైతం అవలీలగా మింగేస్తాడు నీలకంఠుడు.

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః