Friday, August 19, 2011

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా

ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన-చలన విధినిపుణ నిశ్చల నారసింహా

వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత-లవదివ్య వరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నీకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ-కారణ ప్రకట వేంకట నారసింహా

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహ

Saturday, August 6, 2011

నాయమాత్మా బలహీనేన లభ్యతే

అంటే బలం సంపాదించాలి.దేహ దారుఢ్యం ఉండాలి అని అభిప్రాయమా?

కానే కాదు.ధీరుడు,శూరుడు అన్న శబ్దాలను సూచిస్తూ శంకరులు ప్రశ్నోత్తర రత్నావళి లో శమ దమాలు కల వాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు అని చెప్తారు. శమము అనగా మనోనిగ్రహము, దమము అనగా ఇంద్రియనిగ్రహము అని. సాధన చతుష్ఠయం లో కూడా ఇవి కలిగిన సాధకులే మోక్షానికి అధికారి అని పేర్కన్నారు శంకరభగవత్పాదులు.

కాబట్టి మనోనిగ్రహము కలవాడే ఆత్మవిద్యకు అర్హుడు.

Tuesday, August 2, 2011

జ్ఞానాదేవ హి కైవల్యం

భగవంతుని చేరు కొనడానికి, సాక్షాత్కారానికి ఎన్ని మార్గాలు ఉన్నా ముముక్షువుకి ఉన్న ఏకైక మార్గం నివృత్తి మార్గమే.

భోధో అన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనమ్
పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిధ్ధ్యతి (ఆత్మ బోధ)


మిగిలిన సాధనల కంటే జ్ఞానమే సూటియైనది. ఎలాగయితే అగ్ని లేనిదే వంట సాద్యపడదో అలా జ్ఞానం లేనిదే మోక్షం సిధ్ధించదు.

కర్మ మాయను నిర్మూలించలేదు

నిదాఘుడు అను సదాచార సంపన్నుడు నిత్యం అన్నదానం చేస్తూ ఉంటాడు.ఒక నాడు ఋభుమహర్షి అక్కడకు వచ్చి నిదాఘుడిపైన ఆయనకు వాత్సల్యం మెండు కావడంతో, వాడికి అద్వైతాన్ని విశదంగా బోధించాడు.అయినా నిదాఘునికి సంప్రదాయానుసారమైన కర్మకాండలో మనస్సు చిక్కుకొని ఉండడం వల్ల వాటిని అనుసరిస్తూ స్వగ్రామంలో ఉండేవాడు.
ఒకసారి ఋభుమహర్షి మారువేషంలో అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు రాజభవనం నుంచి ఉత్సవంతో బయలుదేరిన రాజును చూస్తూ నిలబడి ఉన్నాడు నిదాఘుడు. పల్లెటూరి వాని వేషంలో ఉన్న ఋభువు నిదాఘుని పక్కకు చేరి ఈ గుంపులు, కేకలు ఏమిటి నాయనా? అని అడిగాడు. ఆయన వైపు కూడా చూడకుండా రాజుగారు ఊరేగేందుకు వెడుతున్నారని నిదాఘుడు జవాబిచ్చాడు. ఎవరు రాజు? అన్నాడు పల్లెటూరి వాడు. పైన ఉన్నవాడు రాజు, కింద ఉన్నది ఏనుగు అని సమాధానమిచ్చాడు నిదాఘుడు. పైన, కింద అంటే ఏమిటో అర్థం కాలేదన్నాడు ఆ పల్లెటూరి వాడు. నిదాఘుడు కోపంతో ‘‘అయితే నీకు ఆచరణ రూపకంగానే బోధించాలి. వంగు,’’ అన్నాడు. పల్లెటూరివాడు ముందుకు వంగాడు.

నిదాఘుడు వెంటనే అతని వీపు మీదికి ఎక్కి కూర్చొని ‘‘పైన నేను రాజువలె ఉన్నాను. క్రింద నీవు ఏనుగు వలె ఉన్నావు. సరేనా. బాగా అర్థమైందా?’’ అన్నాడు. ‘‘ఊహూ... అర్థం కాలేదు. ‘నేను’, ‘నీవు’ అంటున్నావు. ‘నేను’ ఎవరు? ‘నీవు’ ఎవరు? విశదంగా చెప్పు అన్నాడు ఆ పల్లెటూరి వాడు, నిదాఘుని అంతర్ముఖునిగా చేయదలచి- నిదాఘునకు మారువేషంలో ఉన్నది తన గురువేనని తెలిసింది. గభాలున కిందికి దుమికి గురువుగారి కాళ్లపై పడ్డాడు. స్వరూప వర్ణన చేస్తూ అందులో దృఢనిశ్చయం ఏర్పడే విధంగా నిదాఘునకు ఋభుమహర్షి బోధించారు.

కర్మ మాయను నిర్మూలించలేదు ఎందుకంటే వాటకి విరోధము లేదు గనుక.విద్య మాత్రమే (ఆత్మవిద్య) అవిద్యను దీపము చీకటిని తొలగించిన విధంగా నిర్మూలించగలదు. 

అవిరోధతయా కర్మ నావిద్యాం వినివర్తయేత్
విద్యా విద్యాం నిహన్త్యేవ తేజః తిమిర సంఘవత్ (శంకర భగవత్పాద విరచిత ఆత్మ బోధ)

జ్ఞానము వలన మాత్రమే మోక్షము.